పోలీసుల అదుపులో ప్రతిపక్ష నాయకులు   

6 Jun, 2018 12:15 IST|Sakshi
మోస్రాలో మోహరించిన పోలీసు బలగాలు  

మంత్రి పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్ట్‌లు

మోస్రా బంద్‌ పాటించిన వ్యాపారులు

గ్రామంలో భారీగా పోలీసు  బలగాల మోహరింపు

వర్ని(బాన్సువాడ) : వర్ని మండలం మోస్రా గ్రామంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటన దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన మండలాల ఏర్పాటులో భాగంగా మోస్రా గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడంలో మంత్రి పోచారం నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసిస్తూ ప్రతిపక్ష నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం  ఉదయం మోస్రాలో భారీస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్‌ బృందాలను రప్పించారు. ఉదయం వేళ బస్టాండ్‌ వద్ద, ఇళ్లలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకుని నిజామాబాద్‌ నాల్గోటౌన్‌కు తరలించారు. 

గ్రామంలో మంత్రి కార్యక్రమం ముగిసిన తరువాత సాయంత్రం వారిని వదిలిపెట్టారు. ఇళ్లలో ఉన్న కార్యకర్తలను కూడా బలవంతంగా పీఎస్‌కు తరలించడం అన్యాయమని, అడిగే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. 

పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్‌ రెడ్డి, యువమోర్చా నాయకుడు సందీప్‌ రెడ్డి, సుదర్శన్‌ గౌడ్, శ్రీనివాస్, కాంగ్రెస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామిగౌడ్, హరినారాయణ, కె.లక్ష్మణ్, సాయిలు తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు