పెంపుడు కుక్క చోరీ

24 Jul, 2019 13:13 IST|Sakshi
కుక్కను బైక్‌పై తీసుకెళ్తున్న వ్యక్తులు , చోరీకి గురైన కుక్క

యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు   

కుషాయిగూడ: పెంపుడు కుక్క చోరీకి గురైన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. గుర్తు తెలియని యువకులు బైక్‌పై వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.  బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సైనిక్‌పురి సెకండ్‌ ఎవెన్యూలో ఉంటున్న వంశీచంద్‌ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. కుక్కలపై అభిమానంతో అతను నాలుగు కుక్కలను పెంచుకుంటున్నాడు.

సోమవారం ఉదయం వంశీధర్‌ వాకింగ్‌ వెళ్లిన సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతని ఇంటి  వద్ద  రెక్కీ నిర్వహించారు. వారిలో ఒకరు గేటు ఓపెన్‌ చేసి ఇంట్లో ఉన్న కుక్కలకు ఏదో వాసన చూపించి పరుగు తీయడంతో కుక్కలు అతని వెంటే బయటికి వచ్చాయి. కొద్ది దూరం వెళ్లగానే వాటిలో ఓ కుక్కను బైక్‌పై తీసుకొని పరారయ్యారు. సాయంత్రం వరకు కుక్క ఇంటికి రాకపోవడంతో సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన వంశీచంద్‌ కుక్క చోరీకి గురైనట్లు గుర్తించి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. సీసీ పుటేజీల ఆధారంగా నింధితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు