గిలకలదిండిలో బాలికకు గర్భం

1 Mar, 2019 13:33 IST|Sakshi

9వ తరగతి చదువుతున్న బాధితురాలు

యజమాని కొడుకు పనేనని ఆరోపణలు

పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు

మచిలీపట్నం టౌన్‌ : కృష్ణా జిల్లా గిలకలదిండికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చింది. గిలకలదిండిలోని మునిసిపల్‌ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక కడుపు నొప్పిగా ఉందని తల్లికి చెప్పటంతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేయగా గర్భం ధరించినట్లు నిర్ధారించారు. బాలిక తల్లి అదే ప్రాంతానికి చెందిన సుభద్రమ్మ అనే మహిళ ఇంట్లో రెండేళ్లుగా పనికి వెళుతోంది. ఆమె వెంట బాలిక కూడా తరచూ పనికి వెళ్లేది. అయితే, సుభ్రదమ్మ కుమారుడు స్వామి లైంగిక దాడికి పాల్పడిన కారణంగానే గర్భం దాల్చిందని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కారుణ్య నియామకం..
కాగా, తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోవటంతో ఆయన ఉద్యోగం కొడుకు స్వామికి వచ్చింది. స్వామికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం కైకలూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి తరచూ గిలకలదిండి వచ్చేవాడని, ఈ సందర్భంలో తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు చేసింది. బాలిక గర్భం ధరించటంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మచిలీపట్నం సీఐ వాసవి, ఎస్సై దుర్గాప్రసాద్, సిబ్బంది ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. బాలిక, ఆమె తల్లి వాంగ్మూలం నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు