ట్రాన్స్‌జెండర్‌పై సామూహిక అత్యాచారం

22 Oct, 2019 17:14 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ట్రాన్స్‌జెండర్‌ను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. ఈ దారుణ ఘటన సెప్టెంబర్‌ 20న కామలి నగరంలోని ధూప్‌సారి గ్రామంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కామలి నగరానికి చెందిన నలుగురు ట్రాన్స్‌జెంటర్‌ ఓ ఈవెంట్‌ కోసం సెప్టెంబర్‌20న ధూప్‌సారి గ్రామానికి వెళ్లారు. అక్కడి కార్యక్రమం ముంగించుకొని అర్థరాత్రి 2 గంటల ప్రాంతంతో స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యలో ఐదుగురు దుండగులు వీరిని అడ్డుకున్నారు. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. ఓ ట్రాన్స్‌జెండర్‌ని కిడ్నాప్‌ చేసి సమీపంలోని ఫామ్‌హౌజ్‌కి తీసుకెళ్లారు.

అనంతరం ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు గంటల పాటు ఆ ట్రాన్స్‌జెండర్‌కు నరకం చూపించారు. అనంతరం ఆమెను సహివాల్‌ నగరంలో విడిచిపెట్టి పారిపోయారు. ఓ స్నేహితురాలి ద్వారా ఇంటికి చేరుకున్న ఆమె.. మరుసటి రోజు హరప్పా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకోలేదు. దీంతో ఆమె సహివాల్‌ డీపీఓకు ఫిర్యాదు చేశారు. డీపీఓ సూచన మేరకు కేసు నమోదు చేసుకున్న హరప్పా పోలీసులు.. నెల రోజుల తర్వాత నిందితులను అరెస్ట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు