పెయింటర్‌ దారుణ హత్య

27 Apr, 2018 06:57 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ స్నేహిత తదితరులు (ఇన్‌సెట్‌లో) పిల్లి రామారావు(ఫైల్‌)

రోకలి బండతో కొట్టి హత్య చేసినట్లు గ్రామస్తుల కథనం

వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఘటన !

పోలీసుల అదుపులో నిందితుడు

కొల్లిపర: పెయింటర్‌ హత్యకు గురైన సంఘటన కొల్లిపరలో కలకలం రేపింది.  అక్రమ సంబంధం నేపథ్యం లోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు.. కొల్లిపర దళితవాడకు చెందిన పిల్లి రామారావు(48)కు అతని ఇంటికి సమీపంలో నివసించే ఓ వివాహితతో గతంలో అక్రమ సంబంధం ఉండేది. విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు అతడిపై దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటన తర్వాత ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని వదిలేశారు. అయితే, రామారావు మద్యం తాగి సదరు వివాహిత ఇంటి సమీపానికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి వెళ్లిన అతను హత్యకు గురయ్యాడు.

మృతదేహాన్ని తెనాలి డీఎస్పీ ఎం. స్నేహిత, తెనాలి రూరల్‌ సీఐ చినమల్లయ్య, కొల్లిపర ఎస్‌ఐ కె. శ్రీనివాసరెడ్డి  సిబ్బందితో కలసి పరిశీలించారు. ఘటనకు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వివాహేతర సంబంధం ఉన్న మహిళ భర్త కంచర్ల ఎలీషా ఇంటి వెనుక నుంచి వచ్చి రోకలి బండతో రామారావుపై దాడి చేశాడని, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిందితుడు ఎలీషా, అతని భార్య పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు