బస్సులో నుంచి పడి ప్రయాణికుడి మృతి

2 Mar, 2018 07:24 IST|Sakshi
ప్రయాణికుడు వెంకటయ్య(48)

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు నుంచి పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సముద్రాల గ్రామానికి చెందిన వెంకటయ్య కూలి (48)నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం గూడూరుకు వెళ్లిన ఆయన రాత్రి తిరిగి ఆర్టీసీ బస్సులో సముద్రాలకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఫుట్‌బోర్డు వద్ద ఉన్న ఆయన సముద్రాల స్టేజీ సమీపాన ఉన్న పెట్రోల్‌బంక్‌ వద్ద ప్రమాదవశాత్తు బస్సు నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రావుల నరేందర్‌ తెలిపారు. 

చెరువులో పడి పశువుల కాపరి..
జఫర్‌గఢ్‌: చెరువులో పడి పశువుల కాపరి మృతి చెందిన సంఘటన  మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జఫర్‌గఢ్‌ గ్రామ శివారు వడ్డెగూడేనికి చెందిన కత్తుల సోమయ్య (63) అనే వ్యక్తి పశువులను కాస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. రోజు వారీగా సోమయ్య ఉదయాన్నే గ్రామానికి చెందిన గేదెలను తొలుకుని గ్రామ చివర ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో పశువులు మేస్తూ చెరువు అవతలి గట్టుకు వెళ్లాయి. ఇది గమనించిన సోమయ్య వాటిని పక్కకు తొలుకొచ్చేందుకు చెరువులోకి దిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా, మృతదేహాన్ని  ముదిరాజ్‌ కులస్తుల సాయంతో బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.
 

మరిన్ని వార్తలు