ఉద్యోగం పేరుతో మహిళను దుబాయ్‌కి పంపి..

12 Sep, 2019 09:41 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దూరపు బంధువుల ద్వారా కర్నూలు నగరానికి చెందిన ఓ మహిళను ఉద్యోగం పేరుతో దుబాయికి పంపించాడు. అంతే అక్కడ  చిత్రహింసలకు గురైన బాధిత మహిళ తన దీనస్థితిని వాట్సాప్‌లో పెట్టడంతో స్పందించిన పోలీసులు బాధితురాలిని సురక్షితంగా రప్పించారు. వివరాలు.. నగరంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని చిత్తారివీధికి చెందిన మున్నీ అనే మహిళ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో కడపలో ఉన్న బంధువులు అక్కడే ఉన్న మొహినుద్దీన్‌ అనే పాస్‌పోర్టు ఏజెంటును సంప్రదించి మున్నీకి దుబాయిలో ఉద్యోగం చూపించాలని విన్నవించారు. వివరాలు సేకరించిన ఆ ఏజెంట్‌ కర్నూలులోని మహిళ ఇంటికి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇటీవల దుబాయి పంపించాడు.

అక్కడకు వెళ్లినప్పటి నుంచి యజమాని మానసికంగా వేధించడంతో బాధితురాలు మున్నీతో పాటు ఇదే సమస్యను ఎదుర్కొంటున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో ముగ్గురితో కలిసి వాట్సాప్‌ ద్వారా వారి బాధలు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన ఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఒకటో పట్టణ పోలీసులను ఆదేశించారు. పోలీసులు విషయాన్ని దుబాయిలోని భారత కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితురాలిని ఇండియాకు రప్పించారు. ఇదే సమయంలో కడపలోని బాధితురాలి బంధువులు ఏజెంట్‌ మోసంపై పాల్పడి తమ కూతురును అమ్మేశారని పోలీసులకు గత నెల 26న ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మోసగాడిని కడపలో అరెస్టు చేసి ఇక్కడికి తీసుకు వచ్చినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. బుధవారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

 

మరిన్ని వార్తలు