ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి ఏడీఏ

16 Nov, 2019 08:17 IST|Sakshi
పట్టుబడిన క్రిష్ణారెడ్డి

సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్‌)  : పెద్దపల్లి వ్యవసాయశాఖ ఏడీఏ క్రిష్ణారెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కరీంనగర్‌కు చెందిన నగునూరి లక్ష్మణ్‌ పెద్దపల్లిలో ఫెర్టిలైజర్‌ దుకాణం ఏర్పాటుకు లైసెన్సుకోసం ఏడీఏ రూ.15వేలు డిమాండ్‌ చేశారు. లక్ష్మణ్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.10వేలు ఏడీఏ చేతికి అందిస్తుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య పట్టుకున్నారు. పట్టణంలోని జెండాచౌరస్తా ఏరియాలో ఫెర్టిలైజర్‌ దుకాణం కోసం లైసెన్సు ఇవ్వాల్సిందిగా రెండు నెలలుగా లక్ష్మణ్‌ «అధికారులచుట్టూ తిరుగుతున్నాడు. ఏడీఏ క్రిష్ణారెడ్డిని కలిసి లైసెన్స్‌ గురించి ప్రశ్నిం చాడు. తనకు రూ.15వేలు ఇవ్వాలని, మిగతా ఉద్యోగులకు ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చి లైసెన్స్‌ తీసుకెళ్లాల్సిందిగా క్రిష్ణారెడ్డి సూచిం చాడు. తాను రూ.10వేలు ఇస్తానని ఒప్పుకుని ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ఏడీఏ కార్యాలయం వద్ద డబ్బులు తీసుకుం టుండగా అధికారులు అరెస్ట్‌ చేశారు. లక్ష్మ ణ్‌వాగ్మూలం సేకరించారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న లైసెన్స్‌ పత్రాలను పరిశీలించారు. 

కార్యాలయం వద్దకు మరో ఇద్దరు బాధితులు
విషయం తెలుసుకున్న మరో ఇద్దరు బాధితులు ఏసీబీ అధికారులను కలిసేందుకు కార్యాలయానికి వచ్చారు. తాను రూ.5 వేలు ఇచ్చానని, మరొకరు రూ.15 వేలు ఇచ్చానంటూ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న కొందరు ఇప్పటికే క్రిష్ణారెడ్డి ఉద్యోగానికి ఎసరు వచ్చిందని, ఇక కొత్తగా ఫిర్యాదు వద్దంటూ వారించడంతో బాధితులు వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

పెద్దపల్లిలోనే నలుగురు అవినీతిపరులు
పెద్దపల్లిలోనే ఆరునెలల కాలంలో నలుగురు అవినీతిపరులు ఏసీబీకి చిక్కారు. రెండువారాల క్రితమే వీఆర్వో లింగమూర్తి రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. శుక్రవారం వ్యవసాయశాఖ అధికారి క్రిష్ణారెడ్డి రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం నివ్వెరపరిచింది. సబ్‌రిజిస్ట్రార్, ఇరిగేషన్‌ శాఖ డీఈ, పాఠశాల హెచ్‌ఎం, తాజాగా చిక్కిన ఏడీఏ లకు రూ.లక్షకు ఐదుపదివేలు తక్కువ జీతం తీసుకొనేవాళ్లే. ప్రభుత్వం భారీగా వేతనాలు చెల్లిస్తున్నా అవినీతిలో మాత్రం తగ్గకుండా ఉద్యోగులు రూ.ఐదు, పది వేలకు చేతులు చాచి, తమ ఉద్యోగ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఏసీబీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు