అచ్చం దండుపాళ్యం గ్యాంగ్‌ తరహాలో..

26 Feb, 2020 08:03 IST|Sakshi

సాక్షి, దొడ్డబళ్లాపురం : చికిత్స కోసమని వైద్యుని ఇంటి తలుపులు తట్టిన దుండగులు లోపల చొరబడి దోపిడీకి పాల్పడ్డ సంఘటన మాగడి తాలూకా కుదూరులో చోటుచేసుకుంది. దండుపాళ్యం ముఠాల తరహాలో దోపిడీ జరగడం గమనార్హం. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో అపరిచితులు డాక్టర్‌ సుభాష్‌ సింగ్‌ ఇంటి తలుపులు తట్టడంతో తీశారు. ఒక మహిళ చిన్న పాపను ఎత్తుకుని వచ్చి ఆయాసంగా ఉందని, మందులు కావాలని అడిగింది. మహిళను లోపలకు రమ్మనగానే ఆమె వెనుకనే 15 మంది ఇంట్లోకి చొరబడ్డారు. వచ్చీరాగానే వైద్యుడు సుభాష్‌ సింగ్, భార్య శశికళ సింగ్, కుమారులు లోకనాథ్‌సింగ్, పృథ్వీ సింగ్‌ల కళ్లల్లో కారం చల్లారు. తరువాత నలుగురినీ కాళ్లు చేతులు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కారు. ఇంట్లో ఉన్న రూ.50వేల నగదు, బంగారు వెండి ఆభరణాలతో పాటు, ల్యాప్‌ట్యాప్, ఇతర ఖరీదైన వస్తువులు, డిజిరో కారును దోచుకెళ్లారు. ప్రతిఘటించిన నలుగురినీ విచక్షణారహితంగా కొట్టారు.   

సీసీ కెమెరాలు, కుక్కలు ఉన్నా..  
అనంతరం వైద్యుని కుమారులు అతి కష్టంమీద కట్లు తెంచుకుని బయటకు వచ్చి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి రక్షించారు. వైద్యుని ఇల్లు విశాలంగా ఉంది. చుట్టూ 14 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి.15 పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయినా దుండగులు నిర్భయంగా వచ్చి దోపిడీ చేసుకుపోవడం ప్రశ్నార్థకంగా ఉంది. తమ చిత్రాలు దొరక్కుండా  దుండగులు సీసీ టీవీల ఉపకరణాలను కూడా అపహరించారు. క్షతగాత్రులను నెలమంగల ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు.కుదూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.      

మరిన్ని వార్తలు