'మద్యం తాగించి నాపై అత్యాచారం చేశాడు'

12 Mar, 2020 15:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమ పేరుతో ఒక యువతిని నమ్మించి ఆపై శారీరకంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడిపై కేసు నమోదు చేసి మూడు నెలలు కావొస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోడంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి తనకు న్యాయం చేయాలని కోరారు. వివరాలు..  అబిడ్స్‌లో ఉంటున్న మహెయ్స్‌ మరియం అనే యువతిని బంజారాహిల్స్‌కు చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌ హైమద్‌ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంబడించాడు. కాగా ఇమ్రాన్‌ ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మరియంను క్రైస్తవ మతం నుంచి ముస్లిం మత మార్పిడి చేయించాడు.

ఈ నేపథ్యంలో ఒకరోజు మరియం వద్దకు వచ్చిన ఇమ్రాన్‌ ఒక హోటల్‌లో తెలిసిన వారి ఫంక్షన్‌ ఉందని చెప్పి వెళ్దామన్నాడు. అయితే మరియం రానని మొండికేయడంతో చేయి చేసుకొని ఆమెకు బలవంతంగా మద్యం తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొంతకాలానికి మరియం గర్భం దాల్చిందని తెలుసుకున్న ఆమె ప్రియుడు బలవంతంగా అబార్షన్‌ చేయించాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడంటూ మరియం అబిడ్స్‌ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇది మా పరిధిలోకి రాదని చెప్పిన పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. అప్పటి నుంచి సదరు యువతి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని బావించి తాను మీడియా ముందుకు వచ్చినట్లు మరియం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు