క్రైం సీరియల్‌ చూసి.. బాలిక కిడ్నాప్‌ 

30 Jan, 2020 08:04 IST|Sakshi

సాక్షి,బెంగళూరు : ఓ హిందీ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే క్రైం ప్యాట్రోల్‌ సీరియల్‌ చూసి ఓ యువకుడు బాలికను అపహరించగా, గంట వ్యవధిలో పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు కాటన్‌పేటే పీఎస్‌ పరిధిలో జరిగింది. బసవనగుడి బుల్‌టెంపుల్‌ రోడ్డు చిరాగ్‌ ఆర్‌.మెహతా (21) పోలీసులకు పట్టుబడిన యువకుడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేథరిన్‌ స్కూల్‌ నుంచి ఇంటికి వెళుతున్న 4వ తరగతి బాలికను చిరాగ్‌ మెహతా అపహరించి బాడుగ స్కూటర్‌లో ఉడాయించాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తండ్రి హీరాలాల్‌ తక్షణం పోలీసులకు సమాచారం అందించాడు. కాటన్‌పేటే సీఐ టీసీ.వెంకటేశ్‌ ల్యావెల్లీ రోడ్డు వద్ద వెళుతున్న చిరాగ్‌ మెహతాను పట్టుకుని బాలికను కాపాడారు. బాలిక తండ్రి హీరాలాల్, కాటన్‌పేటె మెయిన్‌రోడ్డులో నివాసముంటూ చిక్కపేటేలో ఎలక్ట్రిక్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద డబ్బు గుంజాలని దుండగుడు ఈ పథకం వేశాడు. చిరాగ్‌ మెహతా తండ్రి రాకేశ్‌ పెండ్లిపత్రికల దుకాణం నిర్వహిస్తుండేవాడు. టీవీ సీరియల్లో చూసి బాలికను కిడ్నాప్‌ చేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. కేసు విచారణలో ఉంది.

  

మరిన్ని వార్తలు