రోడ్డు ప్రమాదం​ చేయించి ఆపై హత్య

1 Jul, 2020 08:42 IST|Sakshi
మృతుడు సురేష్‌తో భార్య బబిత (ఫైల్‌)

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య 

ముందుగా రోడ్డు ప్రమాదం చేయించారు 

ఆస్పత్రికి తరలిస్తూ హత్యచేశారు 

హత్యకేసు ఛేదించిన పోలీసులు  

సాక్షి, మేడ్చల్‌ : కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి అంతమొందించింది ఓ మహిళ. ఈ హత్య  కేసును మేడ్చల్‌  పోలీసులు చేధించారు. మంగళవారం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్‌ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌ మండలం సైదనిగడ్డతండాకు చెందిన సురేష్‌తో దుండిగల్‌–2 తండాకు చెందిన బబితతో  కొన్నెళ్ళ  క్రితం వివాహం జరిగింది. బబిత పెళ్ళికి ముందు నుంచి తన మేన బావ దుందిగల్‌ తండా–2 కు చెందిన ప్రేంసింగ్‌ తోచనువుగా ఉంటోంది.కాపురంలో తరచూ ఈ కారణంగానే గోడవలు రావడం పెద్దలు సర్ది చెప్పడం అలవాటు గా మారింది. అయితే బబిత తన భర్తను ఎలాగైనా తొలగించాలని ప్రియుడి ప్రేంసింగ్‌తో కలిసి పథకం పన్నారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ఆజ్మీర్‌ ప్రేం, రాజు, నల్గొండకు చెందిన ముజీబ్, వజ్జోత్‌ రాజు, రాహుల్, సూరజ్, మోతీలాల్‌లను జట్టుగా ఏర్పాటు చేసుకుని వారికి పధకం వివరించాడు ప్రేమ్‌సింగ్‌. లక్ష రూపాయలకు చేసుకుని 70 వేల రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చాడు. మే 23న సురేష్‌ శామీర్‌పేట్‌ మండలం యాడారం శివార్లలో డ్యూటీ ముగించుకుని సైదనిగడ్డతండాకు  తన బైక్‌ పై వస్తుండగా డీసీఎంతో ఉన్న ప్రేంసింగ్‌ అనుచరుడు సూరజ్‌ సురేష్‌ వాహనానికి ఎదురుగా వెళ్లి ప్రమాదం చేశాడు. దీంతో సురేష్‌ రోడ్డు కింద కందకంలో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

అక్కడకు చేరుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌ రాజు, అజ్మీర్‌ప్రేం రోడ్డపై వెళుతున్న ప్రయాణికుల్లా నటిస్తూ సురేష్‌ వద్దకు వెళ్ళి రోడ్డుపై కారు లో వెళుతున్నట్లు నటిస్తున్న మరో అనుచరుడు రాహుల్‌ను ఆసుపత్రి తీసుకెళదామంటూ గాయాలకు గురైన సురేష్‌ను కారు వెనుక సీటులో పడుకోబెట్టారు. సురేష్‌ను ఆజ్మీర్‌ప్రేం, ఉత్తర్‌ప్రదేశ్‌రాజులు టీషర్టును నోటిలో కుక్కి హత్య చేశారు. విషయాన్ని ప్రేంసింగ్‌కు తెలియజేయడంతో ఆయన సిద్దిపేట్‌ జిల్లా ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని చెప్పడంతో అక్కడకు తీసుకెళ్ళారు. అక్కడి వైద్యులకు సురేష్‌ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉంటడంతో తమ కారులో తీసుకువచ్చామని వైద్యులకు చెప్పారు. వైద్యులు పరీక్షించి  సురేష్‌ మృతి చెందాడని  నిర్ధారించడంతో  వారు అక్కడి నుంచి పరారయ్యారు.  
 
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు.. 
సురేష్‌ గాయాలతో కాకుండా ఊపిరి ఆడకుండా మృతి చెందాడని పోస్టుమార్టంలో రావడంతో అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేయడంతో అన్ని విషయాలు బయట పడ్డాయి. సురేష్‌ ను ఆసుపత్రిలో చేర్పించిన రాహుల్‌ పై పోలీసులు నిఘా పెట్టి సోమవారం గాగిళ్ళపూర్‌ పట్టుకుని విచారించగా మొత్తం విషయాలు బయటకు వచ్చాయి.మృతుడి భార్య బబిత, ప్రియుడు ప్రేంసింగ్, ఆజ్మీరప్రేమ్, రాహుల్,వజ్జోత్‌ రాజులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఏసీపీ నర్సింహ్మరావు, సీఐ ప్రవీణ్‌రెడ్డి,ఎస్‌ అప్పారావు లు ఉన్నారు.  

మరిన్ని వార్తలు