పండుగకు పిలిచి మరీ చంపారు

14 Aug, 2019 08:03 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : కట్టుకున్న భార్య, బావమరుదులే కాలయములై ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన ఆదిలాబాద్‌ పట్టణంలోని బొక్కగూడలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బావను పండగ కోసం ఇంటికి పిలిచి హతమార్చారు. అంతవరకు బక్రీద్‌ ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆదిలాబాద్‌ టౌన్‌ సీఐ సురేష్‌ తెలిపిన వివరాలు ఆదిలాబాద్‌ పట్టణంలోని బొక్కలగూడలో నివాసం ఉంటున్న షేక్‌ ఆసీఫ్‌ (26)కు ఇద్దరు భార్యలున్నారు.

మొదటి భార్య సదాది కిన్వట్‌. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. అనంతరం ఫిర్దోస్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. ఫిర్దోస్, ఆసీఫ్‌ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మొదటి భార్యను వదిలిపెట్టి తనతో ఉండాలని ఫిర్దోస్‌ ఆసీఫ్‌తో గొడవ పడుతుండేది. పట్టణ మహిళా పోలీస్‌స్టేషన్‌లో సైతం ఈ విషయంలో గతంలో కేసు నమోదయింది. సోమవారం బక్రీద్‌ను పురస్కరించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో షేక్‌ ఆసీఫ్‌ బావమరుదులు సలీం, షారూఖ్‌ ఇంటికి పిలిచారు. మొదటి భార్యను వదిలేసి తమ సోదరితో కలిసి ఉండాలని కోరారు.

ఈ తరుణంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఇరువురు బావమరుదులు ఆసీఫ్‌ను తీవ్రంగా కొట్టి, కత్తెరతో గుండెలో పొడిచారు. రక్తం మడుగులో ఆసీఫ్‌ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించిన స్థానికులు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. రిమ్స్‌ వైద్యులు పరిశీలించి ఆసీఫ్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌లో భార్య ఫిర్దోస్, బావమరుదులు సలీం, షారూఖ్, మామ అజీం, అత్త హలీమా, మరదళ్లు నసీమ, హీనాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు