అన్నను చంపిన తమ్ముడు

30 Jul, 2019 11:31 IST|Sakshi

సాక్షి, తిప్పర్తి (నల్లగొండ) : మండల పరిధిలోని జొన్నగడ్డలగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు భూ తగాదాలే కారణమని తెలిసింది.  సోదరుడు, అతడి భార్య కలిసి ఘా తుకానికి ఒడిగట్టినట్టు సమాచారం. విశ్వనీయ వర్గాల  సమాచారం మేరకు... గ్రామానికి చెందిన ముదిగొండ శంకర్‌ అతని సోదరుడు రమేష్‌ల మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది. పలుమార్లు గ్రామంలోనే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రెండెళ్ల క్రితం శంకర్‌పై అతని తమ్ముడు మరి కొందరితో కలిసి దాడి చేసి గాయపర్చారు. దీంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.  

భూమి కొనుగోలు విషయంలో..
గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద నుంచి అన్నదమ్ములిద్దరూ భూమి కొనేందుకు ఒకరికి తెలియకుండా ఒకరు అడ్వాన్స్‌ ఇచ్చారు. దీంతో మొదలైన వివాదం దాడులు చేసుకునే వరకు వచ్చింది. అయితే పెద్ద మనుషుల సమక్షంలో చెరి సగం చేసుకోవాలని సూచించగా ఒకరు ఒప్పు కోలేదు. దీంతో కొన్ని రోజులు ఆ కొనుగోలు చేసిన భూమి ఎవరూ సాగు చేయకుండా అలాగే ఉంది. అయితే ఇటీవల శంకర్‌ మొత్తం ఎకరన్నర భూమిని దున్నుకున్నాడు. దీంతో వివాదం ముదిరింది.  

తాటిచెట్టు ఎక్కేందుకు రాగా..
తాను కొనుగోలు చేయాలనుకున్న భూమికి శంకర్‌ కూడా అడ్వాన్స్‌ ఇవ్వడాన్ని రమేష్‌ జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా శంకర్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం శంక ర్‌ తాటి చెట్టు ఎక్కే ప్రాంతంలో భార్యతో కలిసి మాటు వేశాడు.  ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న శంకర్‌ తలపై వేప కట్టెతో ఒక్కసారిగా  దాడి చేయడంతో కిందపడిపోయాడు.

దీంతో అదే కర్రతో తలపై మోదడంతో అక్కడికక్కడే శంకర్‌ మృతిచెందాడు. వెంటనే రమేష్‌ అక్కడి నుంచి తన భార్యతో కలిసి పరారయ్యాడు. శంకర్‌ భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రమేష్‌ అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. దంపతులిద్దరే ఘాతుకానికి ఒడిగట్టారా..? హత్యోదంతంలో మరికొందరు భాగ్వాములయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు