‘కరోనా’ సోకిందంటూ వ్యక్తి ఆత్మహత్య

11 Feb, 2020 05:33 IST|Sakshi
బాలకృష్ణ (ఫైల్‌)

చిత్తూరు జిల్లాలో ఘటన

తొట్టంబేడు(చిత్తూరు జిల్లా): తనకు కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో చిత్తూరు జిల్లాలో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. తొట్టంబేడు మండలం శేషమనాయుడుకండ్రిగకు చెందిన బాలకృష్ణ (50) గుండె దడగా ఉందని పరీక్షల కోసం తిరుపతి రుయాకు వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్‌ సోకిందని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చి తనకు కరోనా వైరస్‌ సోకిందని, తనను ముట్టుకోవద్దని కుటుంబ సభ్యులతో చెప్పాడు.

దగ్గరకు వచ్చిన కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టి తరిమి ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. సోమవారం తెల్లవారుజామున బాలకృష్ణ ఇంట్లోంచి బయటికొచ్చి తన పొలానికి వెళ్లి అక్కడ తల్లి సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. 

మరిన్ని వార్తలు