అద్దంకిలో కిడ్నాప్‌ కలకలం

5 Jul, 2019 10:55 IST|Sakshi
యువకుమార్‌ను కారులో ఎక్కిస్తున్న రవిరాజ్‌ అనుచరులు

మహిళలను ఫోన్‌లో వేధిస్తున్నాడంటూ యువకుడిని కారులో దర్శి తరలింపు

తిరిగి అద్దంకి పోలీసుస్టేషన్‌లో యువకుడి అప్పగింత

సాక్షి, అద్దంకి (ప్రకాశం): మహిళను వేధిస్తున్నాడన్న నెపంతో ఓ యువకుడిని కొందరు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌ చేసిన సంఘటన గురువారం పట్టణంలో కలకలం రేపింది. అందిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన వడూరి యువకుమార్‌ భీమవరానికి చెందిన రవిరాజ్‌లు కుటుంబ స్నేహితులు. వీరి మధ్య కొంతకాలం కిందట ఆర్థిక లావాదేవిలు నడిచాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవలు జరిగి తణుకు పోలీసుస్టేషన్‌లో 2017లో రవిరాజు కుటుంబ సభ్యులు యువకుమార్‌పై కేసులు పెట్టారు. ఈ క్రమంలో రవిరాజ్‌ కుటుంబం రెండేళ్ల కిత్రం అద్దంకి వచ్చి నివాసం ఉంటూ ముండ్లమూరు మండలం అగ్రహారంలో చేపల చెరువులు వేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

యువకుమార్‌ తరుచూ రవిరాజ్‌ ఇంట్లోని మహిళకు ఫోన్‌ చేసి నగదు ఇవ్వాలంటూ వేధించటం ప్రారంభించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు రవిరాజ్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో యువకుమార్‌కు రవిరాజ్‌ ఫోన్‌ చేసి డబ్బులు తీసుకునేందుకు అద్దంకి రావాలని చెప్పాడు. అందులో భాగంగా గురువారం యువకుమార్‌ అద్దంకి వచ్చాడు. స్థానిక బంగ్లారోడ్‌ వద్ద వేచి ఉన్న రవిరాజ్‌తో పాటు మరికొందరు యువకుమార్‌ను కొట్టి కారులోఎక్కించుకుని దర్శి తరలించారు. అక్కడ పోలీసుస్టేషన్‌ నుంచి మళ్లీ రాత్రికి అద్దంకి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు యువకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు