ప్రాణం తీసిన సరిహద్దు 

2 Jul, 2019 09:05 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : ఇంటి సరిహద్దు విషయంలో జరిగిన గొడవలో కర్రతో దాడి చేసి ఒకరిని హత్య చేసిన సంఘటన మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక సీఐ నారాయణ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవాడకు చెందిన తోకల మల్లయ్య(45)ను అదే గ్రామానికి చెందిన వరుసకు తమ్ముడైన తోకల గంగయ్య కర్రతో దాడి చేసి హతమార్చాడు. కొద్ది రోజులుగా ఇంటి సమీపంలోని సరిహద్దు విషయంలో ఇరువురి మధ్య గొడవ జరుగుతుంది.

ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని సరిహద్దు మధ్య గల కొయ్య ను తొలగించమని గంగ య్య అడుగగా మల్లయ్య తొలగించనని చెప్పాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన గంగయ్య కర్రతో మల్లయ్య తలపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడికి భార్య లక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు