సాక్షి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఎమ్మెల్యే దినకరన్ ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం పెట్రో బాంబు దాడికి యత్నం జరిగింది. ఈ ఘటనలో బాంబు విసిరిన వ్యక్తి సహా నలుగురు గాయపడ్డారు. చెన్నై బీసెంట్నగర్లో దినకరన్ నివాసం ఉంది. ఇటీవల పార్టీ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాంచీపురంనకు చెందిన పరిమళన్ తన కారులో పెట్రో బాంబులతో దినకరన్ ఇంటికి వచ్చాడు. కారును ఆపి, అందులో ఉన్న పెట్రో బాంబును దినకరన్ ఇంట్లోకి విసిరే యత్నం చేశాడు. అయితే, అది చేజారి కారులోనే పడింది. దీంతో అందులోని మిగతా పెట్రో బాంబులు అంటుకుని పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న దినకరన్ వాహన డ్రైవర్, ఫొటోగ్రాఫర్, ఆటోడ్రైవర్ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.