బెజవాడలో రవిప్రకాశ్‌, శివాజీ!

16 May, 2019 08:26 IST|Sakshi

పోలీసులకు మెయిల్‌ పంపిన రవిప్రకాశ్‌, శివాజీ

సాక్షి, హైదరాబాద్‌ :  నిధుల మళ్లింపులు, ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌...సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఈ మెయిల్‌ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు పాటు ఆయన గడువు కోరారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్‌ ఈ మెయిల్‌లో తెలిపారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్‌ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై పోలీసులు సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా రవిప్రకాశ్‌ నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. ప్రస్తుతం రవిప్రకాశ్‌, శివాజీ విజయవాడలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారం మేరకు వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు తనపై పోలీసులు సీఆర్‌పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్‌ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వచ్చే జూన్‌కు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు