నిర్లక్ష్యం ఖరీదు.. ఘర్షణ

8 Feb, 2018 08:46 IST|Sakshi
రుయాలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మునీశ్వర్‌

పలువురికి తీవ్ర గాయాలు

భూ వివాదాన్ని పరిష్కరించని రెవెన్యూ అధికారులు

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

సాక్షి, తిరుపతి : రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగా బుధవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి అర్బన్‌ మండలం శెట్టిపల్లి పరిధిలో సర్వే నంబర్‌ 468/1, 3, 5, 6, 7, 8లో సుమారు మూడు ఎకరాల పొలం ఉంది. దీన్ని నెల్లూరు సెటిల్‌మెంట్‌ వారు 1984లో తమకు రఫ్‌ పట్టాలు ఇచ్చిన ట్లు లక్ష్మమ్మ, సుబ్బమ్మ వర్గీయులు చెబుతున్నారు. ఆ భూములు తమకు తండ్రి నుంచి సంక్రమించాయని మునెప్ప వర్గీయులు చెబుతున్నారు.

ఈ భూముల విషయమై లక్ష్మమ్మ కోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు మునెప్ప, తమకే అనుకూలంగా ఉందని లక్ష్మమ్మ వర్గీ యులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ మూడెకరాల్లో వరి పంట సాగైంది. దాన్ని తాము సాగు చేశామని మునెప్ప, లక్ష్మమ్మ చెబుతున్నారు. ప్రస్తుతం పం ట కోత దశకు చేరుకుంది. ఈ క్రమంలో పంట కోసేందుకు ఇరు వర్గాల వారు ప్రయత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో నాగరాజు, మునీశ్వర్, రాజశేఖర్, శ్రీనివాసులు, మునిరాజ, వసంతకుమారి, స్వర్ణకుమారి, మునిలక్ష్మి, సంధ్య గాయపడ్డారు. రుయాలో చికిత్స పొందుతున్నారు.

భూముల విషయం తేల్చని అధికారులు
విలువైన ఆ భూమి ఎవరికి చెందుతుందనే విషయాన్ని తేల్చాలని ఇరు వర్గాల వారు రెవెన్యూ అధికారులను కోరారు. అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ పొలంలో సాగు చేసుకునేందుకు ప్రయత్నించడం, గొడవలు పడడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం నిత్యకృత్యంగా మారిం ది. అందులో భాగంగా మూడు రోజుల క్రితం లక్ష్మమ్మ వర్గీయులు పోలీసు అధికారులను కలిసి తాము వరి కోత కోస్తున్నామని మునెప్ప వర్గీయులు అడ్డుకునే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో బుధవారం ఇరువర్గాల వారు దాడులకు దిగారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయమై అలిపిరి ఎస్‌ఐ శ్రీనివాసులును వివరణ కోరగా భూమి వివాదాన్ని రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉందన్నారు. తాము రక్షణ మాత్రమే కల్పిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు