‘ఆమె’ కోసమేనా హత్య?

1 Sep, 2019 08:22 IST|Sakshi

పోలీసుల అదుపులో నిందితుడు హేమంత్‌? 

ఆర్ధిక లావాదేవీలు, వివాహేతర సంబంధంపై అనుమానం  

కూపీ లాగుతున్న పోలీసులు  

సాక్షి, కూకట్‌పల్లి: ఐటీ సంస్థ నిర్వాహకుడు మైలా సతీష్‌ బాబు హత్య కేసులో ప్రధాన నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్‌ బాబును నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్‌ను పోలీసులు గుల్బర్గా వద్ద అదుపులోకి తీసుకున్నట్లు  సమాచారం. సతీ‹Ùబాబు హత్యకు ఆర్ధిక లావాదేవీలతో పాటు ఓ యువతి విషయంలో ఏర్పడిన వివాదాలే కారణం కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని ఐటీ స్లేట్‌ కన్సల్టెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో పనిచేస్తున్న  ఉద్యోగులను విచారించారు. సంస్థ ఆరి్ధక పరిస్థితులతో పాటు ఇద్దరు భాగస్వాముల నడుమ వివాదాలకు కారణాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. 

చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో కొత్తకోణం!

విదేశాల్లో ఎంఎస్‌ పూర్తి చేసిన సతీ‹Ùబాబు ఐటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు కోచింగ్‌ సెంటర్‌లలో విద్యార్ధులకు తరగతులను బోధించడంతో పాటు కన్సల్టెన్సీ నిర్వహించడం ద్వారా ఐటీ సేవలు అందిస్తున్నారు. స్నేహితుడైన హేమంత్‌ను భాగస్వామిగా చేసుకున్న అతను విద్యార్ధులకు శిక్షణ అందించే బాధ్యతలు అప్పగించాడు. క్లాస్‌ వర్కులో సతీ‹Ùబాబు, ట్రైనింగ్‌ వర్క్‌లో హేమంత్‌ ఉమ్మడి సేవలు అందిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా సతీ‹Ùబాబు హత్యకు గురికావడం, స్నేహితుడైన హేమంత్‌ గదిలోనే శవం లభించడం, హేమంత్‌ పరారీలో ఉండటంతో అతనే నిందితుడిగా నిర్దారించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

తనకు దూరమవుతుందని..
సతీష్‌ బాబు, హేమంత్‌ నిర్వహిస్తున్న ఐటీ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి సతీష్‌ తరగతులు బోధించగా హేమంత్‌ ట్రైనింగ్‌ ఇచ్చాడు. దీంతో ఆమె ఇద్దరితోనూ స్నేహంగా, చనువుగా ఉండేది. ఈ నేపథ్యంలో సదరు యువతితో హేమంత్‌ వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆమె కోసం ఏకంగా తన కుటుంబాన్ని సైతం దూరం పెట్టి ఆఫీసు సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. తరచూ ఆ యువతి హేమంత్‌ ఇంటికి వచ్చి వెళ్లేదని, వారు కలిసిమెలిసి ఉండటం చూసినట్లు స్థానిక కాలనీవాసులు సైతం పోలీసులకు తెలిపినట్లు తెలిసింది.

ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె సతీష్‌ బాబుతో చనువుగా ఉండటాన్ని గుర్తించిన హేమంత్‌ స్నేహితుడిపై కోపం పెంచుకున్నాడు. తనకు సొంతమని భావిస్తున్న యువతి సతీష్‌ బాబు కారణంగా దూరమవుతుందని భావించి అడ్డు తొలగించుకునేందుకు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు