క్రెడిట్‌కార్డ్‌ అప్‌డేట్‌ పేరిట మోసం

26 Dec, 2017 10:55 IST|Sakshi
బాబులాల్‌ ,ఆసిన్‌ ,నిబాష్‌ ,రాము

నగరవాసికి లక్షకుపైగా కుచ్చుటోపీ పెట్టిన జాంతార్‌ వాసులు

ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌నంటూ నమ్మించి మోసం

సాక్షి, సిటీబ్యూరో: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వివరాలు ఆప్‌లోడ్‌ చేస్తానంటూ సమాచారం సేకరించి లక్షకుపైగా ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేసిన జార్ఖండ్‌ రాష్ట్ర జాంతార్‌ జిల్లాకు చెందిన నలుగురు సైబర్‌ నేరగాళ్లను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్‌లోని జాంతార్‌లో బాబూలాల్‌ హెంబ్రోమ్, ఆశిన్‌ కిస్క్, నిభాష్‌ మోండల్, రాంమందార్‌లను పట్టుకొని ట్రాన్సింట్‌ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా తెలిపిన మేరకు.. ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌నని వచ్చిన ఫోన్‌కాల్‌ను  బాధితురాలి సోదరి రిసీవ్‌ చేసుకుంది. మీ క్రెడిట్‌ కార్డు వివరాలు ఆప్‌లోడ్‌ చేయాలని అనడంతో ఆ మాటలు నమ్మిన ఆమె క్రెడిట్‌ కార్డు నంబర్, సీవీవీ నంబర్‌తో పాటు ఆమె సెల్‌నంబర్‌కు వచ్చిన వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ)లను చెప్పేసింది. వీటితో నేరగాళ్లు లక్షకుపైగా రూపాయలతో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేశారు.

చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు, అతని సోదరుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు మొబైల్‌ ఫోన్‌లు, కాల్‌డేటా ఆధారంగా జార్ఖండ్‌లోని జాంతార్‌ జిల్లా కర్మతార్‌లో ఉన్నట్టుగా గుర్తించారు. ఎస్‌ఐలు శ్రీనివాస్, విష్ణువర్ధన్‌ నేతృత్వంలోని బృందం అక్కడికెళ్లి జాంతార్‌ పోలీసుల సహాకారంతో  బాబూలాల్‌ హెంబ్రోమ్, ఆశిన్‌ కిస్క్, నిభాష్‌ మోండల్, రాంమందార్‌లను పట్టుకున్నారు. సెల్‌ఫోన్లు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి ట్రాన్సింట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. మియాపూర్‌లోని న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. బ్యాంక్‌ ప్రతినిథులమంటూ, బ్యాంక్‌ల  కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ అంటూ వచ్చే ఫోన్‌కాల్‌లను నమ్మవద్దని, బ్యాంక్‌ల నుంచి ఎవరూ ఎటువంటి ఫోన్‌కాల్స్‌ చేయరని, ఎవరూ అడిగినా కార్డు వివరాలు చెప్పవద్దంటూ  క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిలా తెలిపారు.   

మరిన్ని వార్తలు