చర్లపల్లి జైలుకు రేవంత్‌.. 14 రోజుల రిమాండ్‌

5 Mar, 2020 17:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను పోలీసులు భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. జన్వాడలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై డ్రోన్‌ కెమెరా వాడిన కేసులో  రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రేవంత్‌.. అక్కడి నుంచి నేరుగా నార్సింగి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. డ్రోన్‌ కెమెరా వాడిన కేసులో తనపై సెక్షన్‌ 188, 287, 109, 120(b) కింద కేసు ఎలా నమోదు చేస్తారని రేవంత్‌ పోలీసులతో వాదనకు దిగారు. అలాగే ఆ ఘటనకు సంబంధించి తన ప్రమేయం గురించి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన పోలీసులకు సహకరించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ప్రభుత్వాస్రత్రికి తరలించారు. అనంతరం ఆయన్ని ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. (చదవండి : భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!)

కాగా, ఈ కేసుకు సంబంధించి సెక్షన్‌ 184, 187, 11 రెడ్‌ విత్‌ 5ఏ, రెడ్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద రేవంత్‌రెడ్డితోసహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే వీరు డ్రోన్‌ ఎగరవేసినట్టు పోలీసులు తేల్చారు. రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాయి.(చదవండి : హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌ సోదరులు)

మరిన్ని వార్తలు