ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్) : ఒంటరిగా ఉన్న మహిళకు మాయ మాటలు చెప్పి నగదును దోచేందుకు ప్రయత్నించిన మహిళలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం ఇందల్వాయి మండలం గన్నారంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గన్నారం గ్రామానికి చెందిన టీ.రవి అతడి భార్య ఆకృతి గ్రామంలోని కొత్త ప్లాట్లలో అద్దెకు ఉంటున్నారు. శనివారం ఉదయం జక్రాన్పల్లి మండలం తొర్లికొండకు దేశమ్మ, గంగమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆకృతికి మాయ మాటలు చెప్పి మోసం చేసేందుకు మత్తులోకి దించి 5 పట్టు చీరలు, రూ.పది వేల నగదును అపహరించే ప్రయత్నం చేశారు.
ఇంటి యజమాని కూతురు గమనించి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. గమనించిన సదరు మహిళలు చీరలను, నగదును ఇంట్లో పారేసి పారిపోయే ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని పట్టుకొని వారికి దేహశుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయితే సదరు మహిళలు గ్రామంలో క్షుద్ర పూజలు జరుపుతున్నట్లు వచ్చిన వదంతుల్లో నిజం లేదని, చుట్టు పక్కల గ్రామాల ప్రజల ఇలాంటి మహిళలపై అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.