పేరుపాలెం కేసులో కీలక మలుపు

6 Jul, 2019 11:53 IST|Sakshi
నిందితులను మీడియా ముందు ప్రవేశపెడుతున్న నరసాపురం డీఎస్పీ నాగేశ్వరరావు 

సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : మొగల్తూరు మండలం పేరుపాలెంలో సంచలనం కలిగించిన అశ్లీల వీడియో కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు పేరుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులు ఆగిశెట్టి గోపీనాథ్, గుత్తుల నాగసత్తిబాబును మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసులో మరో కీలక నిందితుడు కటికల బాబులు పరారీ ఉన్నాడని, అతని కోసం స్పెషల్‌టీమ్‌ను నియమించి గాలిస్తున్నామని డీఎస్పీ చెప్పారు. ఇదిలా ఉంటే కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎ–1 నిందితుడు ఆగిశెట్టి సాయిని నెల 3న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్లీల వీడియోలను వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో అప్‌లోడ్‌ చేసేందుకు సాయికి వరసకు తమ్ముడైన ఆగిశెట్టి గోపీనాథ్‌ సహకరించారని, మిగతా ఇద్దరు డబ్బులు డిమాండ్‌ చేస్తూ బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడ్డారని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. 

డీఎస్పీ కథనం ప్రకారం ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పేరుపాలెంలో సెల్‌ పాయింట్‌ నిర్వహించే ఆగిశెట్టి సాయి అమ్మాయిలను ప్రేమపేరుతో మోసం చేస్తుంటాడు. సాయి ఇదే గ్రామానికి చెందిన యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా వీడియో తీసి దాచుకున్నాడు. సాయి సోదరుడు గోపీనాథ్‌ ఆ వీడియోను సాయికి తెలియకుండా దొంగిలించి దానిని తీసుకెళ్లి గుత్తుల నాగసత్తిబాబు, కటికల బాబుకు అందించాడు. ఈ ముగ్గురూ కలిసి వీడియో తిరిగి ఇవ్వాలంటే రూ. 5లక్షలు ఇవ్వాలని సాయిని డిమాండ్‌ చేశారు. అతను సకాలంలో సొమ్మలు ఇవ్వకపోవడంతో వీడియోను ముగ్గురూ కలిసి వాట్సాప్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌ కావడం గ్రామంలో సంచలనం కలిగించింది.

తరువాత బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అశ్లీల వీడియోలున్న మెమరీకార్డ్, ఈ వీడియోలను అప్‌లోడ్‌ చేయడానికి వినియోగించిన రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. మరో నిందితుడు కటికల సాయిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో నరసాపురం సీఐ బి.కృష్ణమోహన్, నరసాపురం, మొగల్తూరు ఎస్సైలు ఆర్‌ మల్లికార్జునరెడ్డి, షేక్‌ మదీనాబాషా పాల్గొన్నారు.

ఏం జరుగుతోంది 
ఇదిలా ఉంటే కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను ఎ1, ఎ2, ఎ3గా చూపించారు. పరారీలో ఉన్న బాబులును ఎ4గా చూపిస్తున్నారు. మొత్తం వ్యవహారంలో బ్లాక్‌ మెయిల్‌ పర్వం నుంచి వీడియోలు సర్క్యులేట్‌ చేయడం వరకూ బాబులు అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతను అనూహ్యంగా కేసులో ఎ4గా నమోదవడం, ఇంకా పట్టుపడకపోవడం వంటి అంశాలు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ అంశాలను పోలీసులు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు