దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్‌ తల్లిదండ్రులు

19 Feb, 2020 15:07 IST|Sakshi

సాక్షి, వేములవాడ : దివ్య హత్యకేసు విచారణలో భాగంగా నిందితుడిగా అనుమానిస్తున్న వెంకటేష్‌ తల్లిదండ్రులను పోలీసులు వేములవాడలో అదుపులోకి తీసుకున్నారు. పరుశరాం గౌడ్‌, లతను విచారణ నిమిత్తం గజ్వేల్‌కు తరలించారు. వెంకటేష్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ తండ్రి మాట్లాడుతూ..‘చిన్నప్పుడు 5,6 తరగతుల్లోనే వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. జ్యోతిష్మతి కాలేజీలో ఇద్దరు ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌లో కోచింగ్‌కు వెళ్లిన వాళ్లు అక్కడే పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అప్పట్లో అమ్మాయి మిస్సింగ్‌ అంటూ దివ్య తల్లిదండ్రులు సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. (దివ్య హత్య కేసులో మరో కోణం..)

దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రేమించి పెళ్లి చేసుకున్నామని.. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో పోలీసుల్ని కలిశారు. ఆ తర్వాత దివ్య మనసు మార్చేసిన ఆమె తల్లిదండ్రులు.. వెంకటేష్‌ వేధిస్తున్నాడని 2018 అక్టోబర్‌లో ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దర్నీ పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అమ్మాయి జోలికి వెళ్లవద్దని పోలీసులు చెప్పడంతో రాత పూర్వకంగా హామీ ఇచ్చాం. మా కొడుకు హత్య చేశాడని అనుకోవడం లేదు. చనిపోయిన వారిని చూస్తేనే భయపడతాడు. అలాంటి వాడు హత్య చేశాడంటే ఎలా నమ్ముతాం’  అని అన్నారు. 
(వారం రోజుల్లో ఆమెకు పెళ్లి, ఈలోగా ఘోరం..)

మరోవైపు దివ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అయితే తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహాన్ని తరలించే ప్రస్తకే లేదని మృతురాలి కుటుంబసభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వెంకటేష్‌ కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు