నయీమ్‌ అనుచరుడునంటూ బెదిరింపులు

22 Apr, 2019 19:29 IST|Sakshi

రూ. 4 కోట్ల ఇవ్వకుంటే చంపేస్తానని వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌ : రియల్‌ ఎస్టేట్‌లో పని చేసే మార్కెటింగ్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేసి నయీముద్దీన్‌(లేట్‌) అనుచరుడిని  రూ 4 కోట్లు ఇవ్వాలని  లేకుంటే  చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన  ఓ యువకుడిని సోమవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హబ్సిగూడకు చెందిన ఎ. యాదవ్‌రెడ్డి పీర్జాదిగూడలోని చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో శ్రీ సాయిహరి హర ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు.  అతని వద్ద టి.వి శ్రీనివాస్‌రావు మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 16వతేదీన శ్రీనివాస్‌రావు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి నేను నయీముద్దీన్‌ అనుచరుడు రహీం బాయ్‌ని మాట్లాడుతున్న రూ 4 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కంగారు పడిన శ్రీనివాస్‌రావు  తన యజమాని యాదవ్‌రెడ్డికి చెప్పాడు.

అనంతరం ఇద్దరు కలిసి  మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్‌రావు వచ్చిన  బెదిరింపు కాల్‌ ఆధారంగా మేడిపల్లి పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌ కాల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా సోమవారం బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడు బోడుప్పల్‌లో ఉన్నాడని తెలుసుకున్నారు.  అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఉప్పల్‌ స్వరూప్‌నగర్‌లో నివసించే బేతి విజయ్‌రెడ్డి అలియాస్‌ విక్కీ, అలియాస్‌ రహీం(20) డిప్లమా సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుకుని ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు.  గత కొంత కాలంగా ఆర్థికంగా నష్ట పోయాడు. దీంతో నయీముద్దీన్‌ అనుచరుడు అని చెప్పుకుని డబ్బులు సంపాదించాలని ప్రణాళిక రూపొందించాడు. ఈక్రమంలో పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లోని శ్రీసాయి హరి హర ఎస్టేట్‌లో పని చేసే మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేసే శ్రీనివాస్‌రావు ఫోన్‌ చేసి రూ 4 కోట్లు డిమాండ్‌ చేసినట్లు విచారణలో తేలింది.  దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి వెల్లడించారు. 22టిఎఆర్‌43)బేతి విజయ్‌రెడ్డి
 

మరిన్ని వార్తలు