ఎన్‌ఆర్‌ఐ పేరుతో యువతికి స్కెచ్‌

14 Jun, 2018 10:01 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా : కోల్‌కతాకు చెందిన ఓ మహిళను రూ ఏడు లక్షలు మోసగించిన ముగ్గురు నైజీరియన్లను హౌరా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఓ వ్యక్తి‍ వివాహ వెబ్‌సైట్‌లో తనకు తాను ఎన్‌ఆర్‌ఐగా పరిచయం చేసుకుని కోల్‌కతాకు చెందిన 22 ఏళ్ల యువతిని ముగ్గులోకి లాగాడు. తాను అమెరికా నుంచి మార్చిలో భారత్‌ వస్తున్నానని ఆమెను నమ్మబలికాడు. ఈ క్రమంలో అదే నెలలో యువతికి ఫోన్‌ చేసిన నిందితుడు తాను న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్నానని, క్లియరెన్స్‌ పొందేందుకు కొంత డబ్బు అవసరమని చెప్పగా చెల్లించేందుకు ఆమె అంగీకరించింది.

ఇక డబ్బును అతని ఎకౌంట్‌లోకి బదిలీ చేసినప్పటి నుంచి ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోందని బాధితురాలు వాపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నోయిడా నుంచి ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని ట్రాన్సిట్‌ రిమాండ్‌పై హుగ్లీకి తరలించి స్ధానిక కోర్టులో హాజరు పరిచారు.

వీరి నుంచి 20 మొబైల్‌ పోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు ట్యాబ్లెట్లు, 21 ఏటీఎం కార్డులు, రూ 3.5 లక్షల నగదు, 30 పాస్‌బుక్కులు, చెక్‌బుక్కులతో పాటు 500 యూఎస్‌ డాలర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. నకిలీ పత్రాలతో నిందితులు యూపీ, మహారాష్ట్రలో పలు బ్యాంకు ఖాతాలు తెరిచారని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు