వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

3 Apr, 2018 11:41 IST|Sakshi
వ్యభిచార గృహం నిర్వాహకులు, విటులతో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు

ప్రొద్దుటూరు క్రైం :గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై వన్‌టౌన్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గృహ నిర్వాహకులతో పాటు ఇరువురు విటులను అరెస్ట్‌ చేసి ఇద్దరు మహిళలను కాపాడగలిగారు. అరెస్ట్‌ వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన బింగిప్రసాద్‌ హోటల్‌ నడుపుకొని జీవనం సాగించేవాడు. అలాగే ఇతని స్నేహితుడు జంబులదిన్నె బాలకృష్ణ మైదుకూరు రోడ్డులో ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహించేవాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి వ్యభిచారం గృహం నడపాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా నంద్యాల నుంచి  అమ్మాయిలను పిలిపించేవారు. నంద్యాల, బెంగుళూరులకు చెందిన యువతులకు డబ్బు ఎర చూపి, ఇక్కడికి రప్పించి వ్యభిచారం నిర్వహించేవారు. ఈ క్రమంలో రామేశ్వరంలోని ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్‌ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్‌ఐలు చిన్నపెద్దయ్య, ఖాన్‌ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో పాటు పట్టణానికి చెందిన గుర్రంపాటి వేణుగోపాల్‌రెడ్డి, బద్వేలి గురుప్రసాద్‌రెడ్డిలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 35 వేల 430 నగదును స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం గుట్టు రట్టు చేసిన సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు