లక్నో : నేరస్తుల చేతికి బేడీలు వేయాల్సిన ఓ పోలీసు అధికారి చేతికే బేడీలు పడ్డాయి. క్షణికావేశంలో కన్న కూతుర్ని చంపి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేద్ ప్రకాశ్ సింగ్ అనే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శుక్రవారం చదువుల విషయంపై కూతురితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్యా మాటమాట పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రకాశ్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ వెంటనే గాయపడ్డ కూతురును స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రినుంచి తిరిగివచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ కోపం కట్టలు తెంచుకుంది.
క్షణికావేశంలో పక్కనే ఉన్న బ్యాటుతో కూతుర్ని కొట్టాడు. దెబ్బలు బలంగా తగలటంతో ఆమె కిందపడిపోయింది. స్పృహ కోల్పోయిన కూతర్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించారు. అయితే ప్రకాశ్ కుటుంబసభ్యులు కేసును తప్పుదోవపట్టించటానికి చూశారు. తమ కూతురు తుపాకితో కాల్చుకుని చనిపోయిందని పోలీసులకు అబద్ధం చెప్పారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో అసలు నిజం బయటపడటంతో ప్రకాశ్ తను చేసిన నేరం ఒప్పుకోకతప్పలేదు.