పోలీసులపై డ్రంకన్ డ్రైవ్ బాధితుల ఆరోపణ
బంజారాహిల్స్: ఈనెల 15న రాత్రి జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 10లోని డైమండ్ హౌస్ వద్ద తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో టీఎస్12 ఈఈ7284 నంబరు కారులో వెళ్తున్న తమను ఆపి పోలీసులు శ్వాస పరీక్షలు నిర్వహించారనీ.. అయితే పరీక్షల అనంతరం ప్రింటెడ్ స్లిప్ ఇవ్వాలని తాము కోరగా పెన్నుతో రాసి ఇవ్వడం జరిగిందని, అందుకే తాము వాగ్వాదానికి దిగినట్లు బాధితులు దీపెన్జైన్, రౌనక్జైన్ తెలిపారు. సుమారు ఐదు సార్లు తమ సోదరి విబాజైన్కు శ్వాస పరీక్షలు నిర్వహించారని ఎన్నిసార్లు ఊదినా ప్రింటెడ్ స్లిప్ రాకపోవడంతో తాము అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు.
పెన్నుతో రాయడం వల్ల దానికి జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించామన్నారు. కారు నంబరుతో సహా అన్ని వివరాలు ప్రింటెడ్ రశీదుపై రావాల్సి ఉండగా మూడు నాలుగు చోట్ల పోలీసులు పెన్నుతో రాసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగామని బాధితులు పేర్కొన్నారు. తమ అభ్యంతరాలు వినిపించుకోకుండా తమపైనే కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు. అయితే ఈ రశీదులు సరైనవేనా అన్నదానిపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పెన్నుతో రాయకుండా రశీదు మొత్తం ప్రింటెడ్ రావాలన్న దానిపై ట్రాఫిక్ పోలీసులు ఏం జవాబు చెబుతారో చూడాల్సి ఉంది.