మహిళపై లైంగికదాడి; పాస్టర్‌పై కేసు నమోదు 

8 Apr, 2020 09:19 IST|Sakshi

సాక్షి, కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మహిళకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా ఫొటోలు తీసి, బెదిరించి పలుమార్లు లైంగికదాడి చేసిన ఒక పాస్టర్‌ ఉదంతం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన రాచర్ల జోయెల్‌ రాజుపేటలోని ఇమ్మానియేల్‌ గాస్పెల్‌ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజుపేటకు చెందిన ఓ వివాహితతో ప్రార్థనల పేరిట పరిచయం పెంచుకున్నాడు.

2019 అక్టోబరులో ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు వేసి సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా ఫొటోలు తీశాడు. ఫొటోలు చూపించి కోరిక తీర్చాలని, లేదంటే సోషల్‌ మీడియాలో వాటిని పోస్ట్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేసి, పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఇటీవల అతని వేధింపులు అధికం కావడంతో మానసికంగా నలిగిపోయిన భార్యను చూసి అనుమానం వచ్చిన భర్త నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీనిపై ఇనగుదురుపేట పోలీసులకు తనపై బలవంతంగా లైంగికదాడి చేశాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇనగుదురుపేట పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు