చాటింగ్‌ తెచ్చిన చేటు 

29 Oct, 2019 04:55 IST|Sakshi

బాలికతో యువకుడి షేర్‌చాట్‌

అనంతపురం నుంచి విజయవాడ రాక

పోలీసులకు అప్పజెప్పిన బాలిక బంధువులు

తాడేపల్లిరూరల్‌: పదిహేను రోజుల క్రితం ఒక బాలిక (14) అనంతపురంలో నివసించే ఓ యువకుడికి షేర్‌చాట్‌లో మెసేజ్‌ పంపించింది. అప్పటినుంచి బాలికతో ఆ యువకుడు షేర్‌చాట్‌లో మెసేజ్‌ చేస్తున్నాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రమణపల్లికి చెందిన ఎం.విజయకుమార్‌ ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక గత 15 రోజులుగా ప్రతిరోజూ షేర్‌చాట్‌లో మెసేజ్‌లు చేసుకుంటున్నారు.

తనను ఇంట్లోంచి తీసుకువెళ్లిపోమని, లేదంటే చనిపోతానని మెసేజ్‌ పెట్టడంతో విజయకుమార్, అతని సోదరుడు నవీన్‌ ఆదివారం అనంతపురం నుంచి బయల్దేరి సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌కు వచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు హోటల్‌కు వెళ్లి యువకులను పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మెసేజ్‌ చేసింది బాలిక అనుకోలేదని, తాను డిగ్రీ పూర్తి చేశానని ఆమె తనతో చెప్పిందని విజయకుమార్‌ పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు