సీసీ కెమెరాల పుటేజీతో గంటలోనే..
5తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
కడప అర్బన్ : కడప నగరంలోని నమస్తే బోర్డు సమీపంలో ఆటోలో బంగారు ఆభరణాల బ్యాగ్ను పోగొట్టుకున్న బాధితులకు టూటౌన్ ఎస్ఐ రుష్యేంద్రబాబు తమ సిబ్బందితో కలిసి కేవలం గంట వ్యవధిలోనే రికవరీ చేసి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిస్మిల్లా నగర్కు చెందిన హనీఫ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు శంకరాపురం స్కౌట్ హాల్లో తమ బంధువుల వివాహం ఉందని ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే తమ బ్యాగ్లో 5 తులాల బంగారు ఆభరణాలు పెట్టుకుని రోడ్డుపైకి వచ్చారు.
అక్కడ ఆటోలో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బయలుదేరారు. శంకరాపురం నమస్తే బోర్డు సమీపంలో స్కౌట్హాల్ వద్ద ఆటోలోనుంచి దిగుతూ బంగారు నగల బ్యాగ్ మరిచిపోయారు. పెళ్లి దగ్గరికి వెళ్లి బ్యాగ్ చూసుకునేసరికి లేకపోవడంతో షాక్కు గురయ్యారు. వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజిల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ, తమ సిబ్బందితో కలిసి ఆటోతో సహా డ్రైవర్ను వెతికి పట్టుకున్నారు. ఆటోలోనే ఉన్న బ్యాగ్, అందులో నగలను కేవలం గంట వ్యవధిలో 2:30 గంటలకు రికవరీ చేయగలిగారు. హనీఫ్కు ఆటోడ్రైవర్ కరీముల్లా ద్వారా బంగారు నగల బ్యాగ్ను అప్పగించారు.