‘డేటింగ్‌ స్కాం తరహాలో కొత్త స్కాం’

5 Jan, 2019 15:48 IST|Sakshi

సాక్షి, సైబరాబాద్‌ : గతంలో జరిగిన డేటింగ్‌ స్కాం తరహాలో షేర్‌ మార్కెట్‌ స్కాం నడుస్తోందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండోర్‌ వేదికగా షేర్‌ మార్కెట్‌ మోసాలు జరుగుతున్నాయని వెల్లడించారు. సెబీ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ సర్టిఫికేట్‌ తీసుకుని సంస్థలు ప్రారంభిస్తారని తెలిపారు. ఇకికామ్‌లో 250 మంది టెలికాలర్స్‌ ద్వారా వినియోగదారులను తీసుకుంటారని, ముఠా ఏర్పాటు చేసిన సంస్ధలో 10వేల మంది వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో నాలుగు సంస్థలు, నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

దాదాపు రూ. 3.5 కోట్లు సీజ్‌ చేశామని అన్నారు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా బాధితులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వినియోగదారులకు ఎక్కువ డబ్బులు ఆశచూపి పెట్టుబడి పెట్టిస్తారని చెప్పారు. నెలకి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఈ సంస్థలు వినియోగదారులకు సలహాలు, సూచనలు చేసి మోసాలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. డీమ్యాట్ అకౌంట్ వినియోగదారులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళలు, నిరుద్యోగులు, పెన్షన్ దారులు ఎక్కువగా మోసపోతున్నారని వెల్లడించారు. ఐబ్రో కంపెనీపై బొంబాయిలో ఫిర్యాదులు ఉన్నాయన్నారు.

మమ్మల్ని నమ్మించి మోసం చేశారు : బాధితుడు ఆదిత్య
షేర్‌ మార్కెట్‌ ష్కాంలో మోసపోయిన బాధితుడు ఆదిత్య మాట్లాడుతూ.. ‘షేర్ మార్కెట్లో మా పేరుపై అకౌంట్స్ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఎవ్వరినీ ఎవ్వరూ సాధారణంగా నమ్మరు. వారం రోజుల పాటు మమ్మల్ని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. మార్కెట్లో రేట్స్, ట్రెడ్స్ వారం రోజుల పాటు వాళ్లు చెప్పిన విధంగా ఉండేది. కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసి.. తరువాత లక్షల్లో పెట్టుబడులు పెట్టాము. షేర్లు పెట్టిన వాళ్లకు తెలియకుండా షేర్లు కొన్నామని చెప్పి లక్షలు వసూళ్లు చేస్తున్నార’’ని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు