రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

3 Jun, 2020 09:59 IST|Sakshi

భార్యాబిడ్డలను చూడకుండానే మృత్యు ఒడికి

పశ్చిమగోదావరి,గణపవరం: పండంటి బిడ్డ పుట్టిన ఆనందంతో ఉన్న ఆకుటుంబంలో విధి విషాదాన్ని నింపింది. ఆస్పత్రిలో ప్రసవించిన భార్యను, తన బిడ్డను చూసుకోవడానికి ఆనందంగా వెళ్తున్న వ్యక్తిని మినీలారీ రూపంలో మృత్యువు కబళించింది. దాంతో ఆకుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి గణపవరం ఎస్సై ఎం.వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరానికి చెందిన చిట్టిమాని రాజు(40) మంగళవారం ఉదయం తన ఆరేళ్ల కుమార్తె సాయిసంజనతో కలిసి మోటార్‌ సైకిల్‌పై  భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తుండగా గణపవరం మండలం చిలకంపాడు వద్ద తాడేపల్లిగూడెం నుంచి వస్తున్న మినీలారీ ఢీకొంది. లారీ చక్రం రాజు తలమీదుగా పోవడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.

కుమార్తె సంజనకు గాయాలవడంతో గూడెం ఆస్పత్రికి తరలించారు.  భీమవరం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు భార్య అరుణ తాడేపల్లిగూడెంలోని ఒక ఆస్పత్రిలో ఇటీవలే ప్రసవించింది. మంగళవారం ఈమెను ఆస్పత్రి నుంచి డిచార్జి చేస్తుండటంతో భార్యాబిడ్డలను చూడటానికి రాజు కుమార్తె సంజనతో కలిసి తాడేపల్లిగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండంటి బిడ్డతో ఆస్పత్రినుంచి బయటకు వస్తుండగా, ఆమె భర్త మృతదేహం ఆస్పత్రికి రావడం వారి కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఎస్సై ఎం.వీరబాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

మరిన్ని వార్తలు