మేనకోడలిపై పోలీస్‌ లైంగికదాడి

26 Jun, 2020 10:24 IST|Sakshi
అత్యాచారానికి ఒడిగట్టిన కానిస్టేబుల్‌ ఉమేశ్‌

 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం

కానిస్టేబుల్‌ అరెస్ట్‌

పోలీస్‌ శాఖకు అవమానమన్న సీపీ

సికింద్రాబాద్‌: కూతురిలాంటి మేనకోడలిపై మద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఇంతటిదారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన మేరకు..  రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైం కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వరదరాజ్‌ సుదేశ్‌ ఉమేశ్‌ (33) సిక్‌విలేజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఉమేశ్‌ భార్య ప్రసవం కోసం సొంత ఊరికి వెళ్లింది. ఉమేశ్‌ ఇంటి పక్కనే అతడి సొంత అక్క కుటుంబం నివాసముంటోంది. దీంతో సోదరి ఉమేశ్‌కు రోజూ భోజనం పంపించేది. రెండు నెలల క్రితం ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే ఉన్న కానిస్టేబుల్‌ ఉమేశ్‌ పీకల దాకా మద్యం తాగి ఉన్నాడు. అదే సమయంలో తన అక్క కూతురు మేనకోడలు (12) భోజనం బాక్సు తీసుకుని ఇంట్లోకి వచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఉమేశ్‌ మైనారిటీ తీరకి మేనకూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

వెలుగు చూసిందిలా...
భోజనం ఇచ్చి రావడానికి ఆ చిన్నారి తప్పించుకుంటుండటంతో తల్లికి అనుమానం వచ్చింది. ఉమేశ్‌ పేరు తీసినపుడల్లా కూతురు భయంతో వణికిపోతుండంతో తల్లి నిలదీసింది. దీంతో మేనమామ తనపై జరిపిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పి బోరున విలపించింది. ఎవరికి చెప్పినా ఇంట్లో అందరినీ తుపాకితో చంపేస్తానని ఉమేశ్‌  బెదిరించినట్టు తల్లికి వివరించింది. దీంతో బాలిక తల్లి బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

పోలీస్‌శాఖకు అవమానం ...
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని ఉమేశ్‌పై ఫోక్సో చట్టంతో కేసు నమోదు చేసి కోర్టుముందు ప్రవేశపెట్టినట్టు ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఒక పోలీస్‌శాఖకు చెందిన ఒక కానిస్టేబుల్‌ ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడం అవమానంగా భావిస్తున్నామని సిటీపోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ విచారం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు