ప్రియుని కళ్లెదుటే ప్రియురాలిపై పోలీసుల అత్యాచారం

15 Mar, 2020 07:54 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన రక్షక భటులే భక్షించిన సంఘటన పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు పోలీసులు సస్పెండ్‌ అయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన పుదుచ్చేరికి ప్రతి వారాంతపు రోజుల్లో పలువురు ప్రేమజంటలు రావడం పరిపాటి.  ఇలా శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన రెండు ప్రేమ జంటలు పరిసరాల చుట్టి అక్కడ బసచేశారు. గస్తీ విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు సతీష్‌ కుమార్, సురేష్‌ ప్రేమ జంటలు ఉన్న గదులు తలుపు తట్టారు. ఒక ప్రేమ జంట తలుపు తట్టి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతామని, కేసులు పెడతామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ ప్రేమ జంట వారికి రూ. 20 వేలు ఇచ్చి సర్దుబాటు చేసుకుంది.

ఆ తర్వాత మరో ప్రేమజంట వద్దకు వెళ్లగా వారి వద్ద తగిన డబ్బు లేకపోవడంతో ప్రియుని కళ్లెదుటే అతని ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. జరిగిన సంఘటనను బయటకు చెబితే పరువు పోతుందని భావించిన ఆ జంట పుదుచ్చేరి వదిలివెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. అత్యాచారం, మామూళ్ల వసూళ్ల సంఘటనలు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లు సతీష్‌ కుమార్, సురేష్‌లను సస్పెండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు