ఆస్మాబేగం కేసులో బయటపడిన సంచలన విషయం

24 Dec, 2019 13:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వెన్నుపూసలో బుల్లెట్‌ బయటపడిన ఆస్మాబేగం కేసులో మంగళవారం సంచలన విషయం బయటపడింది. వెన్నులోంచి తీసిన బుల్లెట్‌ను రెండేళ్ల క్రితం నాటు తుపాకీతో కాల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆస్మాను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యంతో వైద్యం చేయించి రక్తస్రావం, నొప్పి తగ్గించారని విచారణలో వెల్లడైంది. ఇది కాకుండా, పోలీసులు ఆస్మా సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసి కాల్‌ రికార్డ్స్‌ ద్వారా విచారణ జరుపుతుండగా మరో కోణం బయటపడింది.

ఆస్మా తండ్రి నజీర్‌ మైలార్‌దేవ్‌పల్లిలోని కింగ్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో వాచ్‌మెన్‌గా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆ ఫంక్షన్‌ హాల్‌ యజమాని షనవాజ్‌ కొడుకు జుబేర్‌ ఓ పెళ్లి బరాత్‌లో కాల్పులు జరిపాడు. ఈ మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో జుబేర్‌పై కాల్పుల కేసు నమోదైంది. ఇప్పుడు ఆస్మాబేగం కేసుతో జుబేర్‌ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ రెండింటికి ఏమైనా సంబంధముందా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు యువతి కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, సర్జరీ అయిన మర్నాడే ఆస్మాబేగంను డిశ్చార్జి చేయడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండిఅంతుచిక్కని తూటా రహస్యం!

మరిన్ని వార్తలు