జయరాం హత్య కేసులో పోలీసుల పాత్రపై విచారణ

19 Feb, 2019 06:12 IST|Sakshi
మాట్లాడుతున్న వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌.శ్రీనివాస్‌

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లోని తన ప్లాట్‌లో  గత నెల 31న  కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరాంను హత్య చేసిన అనంతరం నిందితుడు రాకేష్‌రెడ్డి ఐదుగురు పోలీసు అధికారులతో మాట్లాడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు. సదరు అధికారులను విచారిస్తామని ఏ పరిస్థితుల్లో వారు మాట్లాడాల్సి వచ్చిందో విశ్లేషించేందుకు కాల్‌డేటాను పరిశీలించనున్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్, రౌడీషీటర్‌ నగేష్, అతడి అల్లుడు విశాల్, సినీ నటుడు సూర్యలను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలో సోమవారం కేసు పురోగతిని వెల్లడించారు. పోలీసు అధికారుల ప్రమేయంపై త్వరలోనే విచారణ చేపడతామన్నారు. గత నాలుగు రోజులుగా ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించామని, బ్యాంకు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించినట్లు తెలిపారు. రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌లతోపాటు రౌడీషీటర్‌ నగేష్, అతని అల్లుడు విశాల్‌ నిందితులుగా ఉన్నారన్నారు. రాకేష్‌రెడ్డి, జయరాంకు డబ్బులు ఇచ్చాడనే విషయంపై స్పష్టత రాలేదన్నారు. ఇప్పటి వరకు 50 మందిని విచారించామని, పద్మశ్రీ ఫిర్యాదుపై కూడా విచారణ జరుగుతుందన్నారు. జయరాం, షికా చౌదరి మధ్య కొన్ని బ్యాంకు లావాదేవీలు జరిగాయని, అయితే హత్యతో వాటికి సంబంధం ఉన్నట్లు చెప్పలేమన్నారు. రాకేష్‌రెడ్డి గతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడని అతడికి ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్‌ లేదని అన్నీ నగదు లావాదేవీలు చేసినట్లు డీసీపీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు