పోలీసు ప్రేమజంట బాహాబాహీ

10 Jan, 2019 13:26 IST|Sakshi

తిరుచ్చిలో సంచలనం

చెన్నై, టీ.నగర్‌: తిరుచ్చి జంక్షన్‌ రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి పోలీసు ప్రేమజంట బాహాబాహీ తలపడ్డారు. తిరుచ్చి రైల్వే స్టేషన్‌ సమీపాన రైల్వే భద్రతా విభాగం పనిచేస్తోంది. ఇక్కడ పోలీసుగా కుమార్‌ పనిచేస్తున్నాడు. మొదటి ప్లాట్‌ఫాంలోగల రైల్వే పోలీస్‌స్టేషన్‌లో జ్యోతిక కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఇరువురూ రైల్వేస్టేషన్‌ విధుల్లో తరచుగా కలుసుకోవడంతో పరిచయం ప్రేమగా మారింది. అలాగే వాట్సాప్‌లో సంభాషించుకునే వారు. ఇదిలాఉండగా ఈనెల ఐదో తేదీ రాత్రి 1.30 గంటల సమయంలో మద్యం మత్తులో కుమార్‌ రైల్వే పోలీసు స్టేషన్‌ బయట నిలుచుని జ్యోతికకు ఫోన్‌ చేసి పిలిచాడు. ఆమె కూడా యూనిఫాంలో బయటికి వచ్చింది.

ఆమెతో కుమార్‌ గంట సేపటినుంచి ఫోన్‌ చేస్తున్నా లిఫ్ట్‌ చేయలేదని, ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన కుమార్‌ ఆమె చెంపను చెళ్లుమనిపించాడు. జ్యోతిక కూడా ఆవేశంగా అతని చెంప పగులగొట్టింది.  తర్వాత ఇరువురూ బాహాబాహి తలపడినట్లు సమాచారం. ఈ సంఘటన అక్కడ సంచలనం కలిగించింది. 

మరిన్ని వార్తలు