పంటర్లూ నిందితులే!

10 Dec, 2018 09:33 IST|Sakshi

పందేలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసుల చర్యలు

ఇప్పటి వరకు కేవలం అంగీకరించిన వారే అరెస్టు

ఇకపై పందేలు కాసే వారు సైతం నిందితులుగా  

ఎలక్షన్స్‌ బెట్టింగ్స్‌ నేపథ్యంలో పోలీసుల నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో: ఏ దేశంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినా నగరంలో బుకీలు సిద్ధమైపోతారు... ఏ జట్లు ఆడుతున్నా సరే పంటర్లు ఎగబడి మరీ పందాలు కాస్తుంటారు. పార్లమెంట్‌ నుంచి పంచాయితీ ఎన్నికల వరకు ఏవి జరిగినా పందెంరాయుళ్లు పడగ విప్పుతారు... గెలుపోటములపై బెట్టింగ్స్‌ నిర్వహిస్తుంటారు.

గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ మధ్య పూర్తయిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్‌ జోరందుకుంది. కేవలం రాష్ట్రానికి చెంది న వారే కాకుండా పొరుగు రాష్ట్రాల బుకీలు, పంటర్లు రంగంలోకి దిగారు. పోలింగ్‌కు–కౌంటింగ్‌కు మధ్య మూడు రోజుల వ్యవధి ఉండటంతో జోరుగా పందాలు సాగుతున్నాయి. వీటిపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు బుకీలపై (పందాలు అంగీకరించే వారు) మాత్రమే నమోదు చేస్తున్న కేసుల్లో ఇకపై పంటర్లనూ (పందాలు కాసే వ్యకు ్తలు) నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు.  

ఇక్కడ పట్టు బిగిస్తే అక్కడకు...
ఎన్నికలు కావచ్చు క్రికెట్‌ సహా ఇతర క్రీడలు కావచ్చు బుకీలకు–పంటర్లకు మధ్య ‘అవినాభావ సంబంధం’ ఉంటుంది. ఈ జూదం నమ్మకం మీద సాగిపోయేది కావడంతో పరిచయస్తులే ఉంటారు. కొత్తగా బుకీలుగా మారే వారు సైతం గతంలో ప్రధాన బుకీల వద్ద పని చేసిన వారై ఉంటారు. వీళ్లు తమ యజమానికి చెందిన కస్టమర్లలో కొందరిని తమ వైపునకు లాక్కుంటారు. వీరి ద్వారా పరిచయమైన వారినే కొత్త కస్టమర్లుగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సిటీలో పోలీసులు ఉక్కుపాదం మోపితే బయటి నగరాలు/రాష్ట్రాలకు వెళ్లిపోతున్న బుకీలు తమ రెగ్యులర్‌ పంటర్ల సాయంతో యథేచ్ఛగా ‘ఆన్‌లైన్‌ దందా’ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంటర్లకు చెక్‌ చెబితే తప్ప బెట్టింగ్‌ దందాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసుల నిర్ణయించారు. పందెం కాసేవాళ్లే లేకపోతే అంగీకరించే వారూ ఉండరని భావిస్తున్నారు. దీనికోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.  

పక్కాగా దొరుకుతున్న ఆధారాలు...
బెట్టింగ్స్‌ గ్యాంగ్స్‌ను టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్వోటీ) బృందాలతో పాటు స్థానిక పోలీసులూ పట్టుకుంటున్నారు. ఇలాంటి గ్యాంగ్స్‌/వ్యక్తుల నుంచి పోలీసులు నగదుతో పాటు టీవీ, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, బెట్టింగ్‌ స్లిప్స్, పుస్తకాలు తదితరాలు స్వాధీనం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధికారులు కొన్ని రికార్డులూ గుర్తిస్తుంటారు. వీటిలో నిందితులు తమ వద్ద పందాలు కానిన వారి పేర్లు, ఫోన్‌ నెంబర్లతో పాటు వారు దేనిపై, ఎంత మొత్తం పందెం కాశారనేది నమోదు చేసి ఉంచుతారు. పంటర్ల వద్ద దొరికిన ల్యాప్‌టాప్స్‌ విశ్లేషిస్తే మరికొందు పంటర్ల పేర్లూ బయటి వస్తాయి. ఓ బుకీలను అరెస్టు చేస్తే పంటర్లు మరో బుకీ వద్ద పందాలు కాసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పంటర్ల పైనా కఠిన చర్యలకు నిర్ణయించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల్నే ఆధారంగా చేసుకుని పంటర్లనూ నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు.  

నోటీసుల జారీకి అవకాశం...
క్రికెట్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో పందాలు కాసే వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. వీరి బెట్టింగ్స్‌కు బానిసలుగా మారారనే విషయం అనేక మంది తల్లిదండ్రులకు తెలీదు. వీరిని కట్టడి చేస్తేనే బుకీలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు పంటర్లనూ నిందితుల జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే ఆస్కారం లేకపోయినా నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఫోన్‌ నెంబర్ల ఆధారంగా చిరునామాలు గుర్తించి, సీఆర్‌పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేయడానికి అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఫలితంగా కుటుంబీకులకూ వీరు పంటర్లనే విషయం తెలియడంతో పాటు వీరి ఆగడాలకు అడ్డుపడే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘పందాలు కాసే వారు ఉన్నంత కాలం బుకీలు పుట్టుకు వస్తూనే ఉంటారు. నగరంలో దాడులు ముమ్మరం చేస్తే గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్ళి వ్యవస్థీకృతంగా వ్యవహారం నడుపుతున్నారు. పంటర్లను కట్టడి చేస్తే ఆటోమేటిక్‌గా బుకీల వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు