ప్లాన్‌ చేసి మరీ దోపిడీలకు పాల్పడుతారు

8 Jul, 2020 16:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అఫ్జల్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దోపిడి దొంగల ముఠాను బుధవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ అంజనీ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఐదుగురు సభ్యుల ముఠా ఈ నెల 4న దోపిడికి ప్లాన్‌ చేశారని.. పుత్లిబౌలిలో ఒక వ్యాపారి తీసుకువెళుతున్న మనీబ్యాగ్‌ను చోరీ చేశారన్నారు. కాగా బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చోరికి పాల్పడ్డ ఐదుగురు దొంగల ముఠా సభ్యులలో సయ్యద్ పాషా, సయ్యద్ ఫైయజ్ ఇమ్రాన్, అమీర్ ఖాన్‌తో పాటు వసీంను అరెస్ట్‌ చేయగా ఒక్కరు మాత్రం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా నిందితుల నుంచి 2.65 లక్షల నగదు, 2 డాగర్స్ ( కత్తులు), 10 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై గతంలోనూ హత్య, చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్‌, హైదరాబాద్‌ పరిధిలోని 4 పోలీస్‌ స్టేషన్‌లో వీరిపై వివిధ కేసులు నమోదైనట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు