టీడీపీ నేత ఇంటిపై పోలీసుల దాడి

17 Jan, 2020 07:52 IST|Sakshi

ఇద్దరు అమ్మాయిలతో దొరికిన వైనం

రాజమహేంద్రవరం రూరల్‌: పిడింగొయ్యి గ్రామ పంచాయతీ పరిధిలోని బుచ్చియ్యనగర్‌ డెయిరీ కాలనీలో ఉంటున్న టీడీపీ నేత పిన్నింటి వెంకట రవి శంకర్‌ ఇంటిపై బుధవారం మధ్యాహ్నం బొమ్మూరు పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో టీడీపీ నేతతో పాటు మరో వ్యక్తి ఇద్దరు మహిళలతో పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. టీడీపీ నేత పిన్నింటి వెంకట రవిశంకర్‌ ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్నారన్న సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఎస్సై శుభశేఖర్, సిబ్బందితో ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో రవిశంకర్‌ గదిలో ఇద్దరు అమ్మాయిలతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన వందే కిశోర్‌ అనే వ్యక్తిని, రవిశంకర్‌లను బొమ్మూరు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వ్యభిచారం చేస్తున్నారన్న దానిపై ఎస్సై శుభాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నేత రవిశంకర్‌ను తప్పించేందుకు టీడీపీ యువనేత ఒకరు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వెండి వ్యాపారం చేసే రవిశంకర్‌ వద్దకు వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు అమ్మాయిలు వచ్చారని నమ్మించే ప్రయత్నాలు చేశారు. కాని సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు లభించాయి. మూడు రోజులుగా టీడీపీ నేత ఇంటి వద్ద కార్లు, అమ్మాయిల హడావుడి ఉన్నట్టు పోలీసులు విచారణలో తేలినట్టు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు