-

దారుణం: భార్య ఆరోగ్యం కోసమే నరబలి!

6 Feb, 2018 10:22 IST|Sakshi
నిందితుడు రాజశేఖర్ ఇంట్లో పోలీసుల తనిఖీలు

వీడిన చిన్నారి నరబలి కేసు మిస్టరీ

ప్రధాన నిందితుడు క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్

ఇంకా లభ్యం కాని చిన్నారి మొండెం 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ చిలుకానగర్‌లో కలకలం రేపిన చిన్నారి నరబలి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగ పడటం కోసమే ఓ పాపను తీసుకొచ్చి బలిచ్చినట్లు సమాచారం. కరీంనగర్‌లోని ఓ తండా నుండి పాపను తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ వెల్లడించాడు. పూర్తి విచారణ అనంతరం అరెస్టయిన అయిదుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే.. 
ఉప్పల్‌ సర్కిల్‌ చిలుకానగర్‌ డివిజన్‌ లో నివసించే రాజశేఖర్‌ (35) క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గత గురువారం ఉదయం ఆయన అత్త బాలలక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లగా ఓ చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్‌ ఉప్పల్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ చెబుతున్న విషయాలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా నరబలి విషయం బయటపడింది.

స్థానికంగా ఉంటున్న మెకానిక్‌ నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో రాజశేఖర్‌తో పాటు నరహరి, అతని కుమారుడు రంజిత్‌, పూజారి, పాపను విక్రయించిన బ్రోకర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజశేఖర్ భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగు పడేందుకు గ్రహణ సమయంలో పూజలు చేసి చిన్నారిని బలిచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి తల దొరికినా.. మృతదేహం (మొండెం) మాత్రం ఇంకా లభించలేదు.

మరిన్ని వార్తలు