నీలి చిత్రాలే.. బాలుడిని ప్రేరేపించాయ్‌!

9 Jun, 2018 07:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వజ్రపుకొత్తూరు : నీలి చిత్రాలే బాలుడిని లైంగికదాడి వైపు నడిపించాయి. సమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ సంఘటన వెనుక నీలిచిత్రాల కథ ఉందని తెలియగానే పోలీసులు అవాక్కయ్యారు. లోతుగా విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చారు. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి గ్రామంలో రెండేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసులో వజ్రపుకొత్తూరు పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పలాసలో మొబైల్‌ షాపు నిర్వహకుడు సాయి ప్రకాష్, బెండి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కె.మల్లేసును వజ్రపుకొత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నీలి చిత్రాలను బాలుడికి చూపించడం వల్లే అత్యాచారం జరిగినట్టు పోలీసులు నిగ్గు తేల్చారు.

వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ కేవీ సురేష్‌ చెప్పిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెల కాపరి మల్లేసు తన మొబైల్‌లో ఉన్న అశ్లీల చిత్రాలను బాలుడుకు ప్రతి రోజూ చూపించడంతో ఆ బాలుడు అశీల చిత్రాల్లో ఉన్న విధంగా తాను కూడా ఎవరికైనా అలా చేయాలని భావించుకుని చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలిందని చెప్పారు. గొర్రెల కాపరి సెల్‌ ఫోన్‌లోకి నీలి చిత్రాలు అప్‌లోడ్‌ చేసి, బాలుడుని నీలి చిత్రాల వైపు మళ్లించినందుకు మొబైల్‌ షాపు నిర్వహకుడు సాయి ప్రకాష్‌ను సైతం విచారించామని,  విషయాలు రుజువు కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని ఎస్‌ఐ తెలిపారు. ఇదే విషయాన్ని కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ బర్ల ప్రసాదరావు తెలిపారు. బాలుడితో పాటు గొర్రెల కాపరి, సెల్‌ షాపు యజమానిని అరెస్టు చేసి పాతపట్నం సబ్‌ జైలుకు తరలించామన్నారు. 

మరిన్ని వార్తలు