శ్రావణిపై అత్యాచారం, అనంతరం హత్య...

27 Apr, 2019 17:48 IST|Sakshi

సాక్షి, యాదాద్రి : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పదోతరగతి స్పెషల్‌ క్లాసులకు వెళ్లిన విద్యార్థిని శ్రావణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్పెషల్‌ క్లాసులకు శ్రావణితో పాటు ఎవరెవరు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనే దానిపై పోలీసులు శనివారం ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. మరోవైపు శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన భువనగిరి ప్రభుత్వ వైద్యులు ప్రాథమిక నివేదిక వెల్లడించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు వైద్యులు తమ నివేదికలో తెలిపారు. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో పాటు, ఆమె ఛాతీ ఎముకలు విరిగినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. 

చదవండి...
విద్యార్థిని శ్రావణి హత్య.. ఎస్‌ఐపై వేటు
అదృశ్యమైన బాలిక హత్య 

కాగా యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో గురువారం అదృశ్యమైన విద్యార్థిని శ్రావణి.. మరుసటి రోజు పాడుబడ్డబావిలో శవంగా కనిపించింది. ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసు విషయంలో అలసత్వం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బొమ్మల రామారం ఎస్‌ఐ వెంకటయ్యపై వేటు పడింది. ఆయనను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌చేస్తూ డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను పట్టుకోవాలంటూ ఇవాళ కూడా మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌...24 గంటల్లో నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

మరిన్ని వార్తలు