కరెంటు మీటర్‌ రీడింగ్‌నే మార్చారు    

18 Aug, 2018 12:50 IST|Sakshi
తనిఖీలు నిర్వహిస్తున్న సెస్‌ అధికారులు  

సిరిసిల్లలో విద్యుత్‌ అక్రమ వినియోగం

సెస్‌ అధికారుల తనిఖీల్లో వెల్లడి

15 మందిపై కేసు నమోదు

సిరిసిల్ల : విద్యుత్‌ వినియోగంపై సెస్‌ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండగా, అంతకుమించిన పరిజ్ఞానంతో సెన్సార్‌ మీటర్లనే మార్చేసి విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్న వైనం సిరిసిల్లలో శుక్రవారం వెలుగుచూసింది. పట్టణంలోని నెహ్రూనగర్‌ ప్రాంతంలో సెస్‌ టౌన్‌ ఏఈ భక్తిసింగ్‌ ఆధ్వర్యంలో సెన్సార్‌ మీటర్లను తనిఖీ చేశారు. బొల్లి రవీందర్, గడ్డం శంకరయ్య, శ్రీనివాస్, సిద్దులవాడలో రాజేశం అనే వినియోగదారుల ఇళ్లలో సెన్సార్‌ మీటర్లను సీల్‌ ఓపెన్‌చేసి మీటరు తిరగకుండా కట్టడి చేశారు. తనిఖీల సందర్భంగా సెన్సార్‌ మీటర్‌ సీల్‌ ఓపెన్‌ చేసినట్లుగా సంకేతాలు ఇవ్వడంతో మరింత నిశితంగా మీటర్లను పరిశీలించారు. దీంతో విద్యుత్‌ చౌర్యం జరిగినట్లుగా నిర్ధారణ అయింది.

సమాచారం అందుకున్న సెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎండీ యూనస్, డీఈఈ గోపికృష్ణ నెహ్రూనగర్‌కు వెళ్లి పరిశీలించారు. వినియోగదారులకు థెప్ట్‌కు సంబంధించి జరిమానా విధిస్తామని, ఆ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేసినట్లు సెస్‌ఎండీ యూనస్‌ తెలిపారు. పదిరోజుల వ్యవధిలో సిరిసిల్ల పట్టణంలో 15 థెప్ట్‌ కేసులు నమోదయ్యాయని సెస్‌ ఎండీ యూనస్‌ వివరించారు. సెప్టెంబర్‌ 1 నుంచి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు