హిమాచల్‌ ప్రదేశ్‌లో కేరళ తరహా ఘటన

6 Jun, 2020 16:30 IST|Sakshi
గాయపడ్డ ఆవు, యాజమాని గురిదాల్‌ సింగ్‌

సిమ్లా : నోరులేని మూగ జీవాలపై మనుషుల దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేరళ ఏనుగు ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన ఒకటి హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పేలుడు పదార్ధాల కారణంగా గర్భంతో ఉన్న ఓ ఆవు నోరు ఛిద్రమైంది. పదిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం హిమాచల్‌ ప్రదేశ్‌, బిలాశ్‌పూర్‌ జిల్లా జాన్‌దుతా ప్రాంత వాసి గురిదాల్‌ సింగ్‌కు చెందిన ఆవు అక్కడి మైదానంలో గడ్డి మేస్తోంది. ఈ నేపథ్యంలో గడ్డిలో ఉన్న పేలుడు పదార్థాన్ని అది కొరకటంతో నోటిలోనే పేలింది. ( గర్భిణి ఏనుగు మృతి: వెలుగులోకి కొత్త విషయం)

దీంతో ఆవు నోరు తీవ్రంగా ఛిద్రమైంది, దవడ భాగం బాగా దెబ్బతింది. తన ఆవు గాయపడటానికి కారణం పొరిగింటి నందలాలేనని దాని యాజమాని సింగ్‌ ఆరోపిస్తున్నారు. ఉద్ధేశపూర్వకంగానే అది గడ్డి తినే చోట పేలుడు పదార్థాలు ఉంచినట్లు తెలిపాడు. ఆవు గాయపడిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో ఉంచాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు ‘యానిమల్‌ క్రూయాల్టీ యాక్ట్‌’కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.(ఏనుగు పోస్టుమార్టం రిపోర్టు: షాకింగ్‌ నిజాలు)

మరిన్ని వార్తలు