ఉత్తరప్రదేశ్లో ఘటన
నీటి వివాదంలో గర్భిణీ కాల్చి వేత
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో ఘోర విషాదం సంభవించింది. నీటి వివాదంలో గర్భిణీని కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఈటా జిల్లా సమౌర్ గ్రామంలో బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ముంచుకొస్తున్న నీటి కొరత ముప్పునకు అద్దం పట్టిన ఘటన ఇది.
నీళ్ల కోసం వాగ్వాదానికి దిగిన కొంతమంది వ్యక్తులు గర్భిణీ అన్న కనికరం కూడా లేకుండా ఓ మహిళపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. బాధిత మహిళను మమత (25) గా గుర్తించారు.
నిందితులు గతంలో కూడా ఇతర గ్రామస్తులతో ఘర్షణ దిగారని గ్రామపెద్ద భాను ప్రతాప్ మీడియాకు తెలిపారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను నిందితులుగా తేల్చిన పోలీసులు ప్రధాన నిందితుడు సంతోష్ను అరెస్ట్ చేశారు.